పరిష్కారంకానున్న భూ సమస్యలు
జిల్లాలో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఖాతాల వివరాల సేకరణ
ప్రభుత్వానికి నివేదికను అందజేసిన సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు
రంగారెడ్డి, మార్చి 24, (నమస్తే తెలంగాణ): రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. అన్నదాత సమస్యలతో ఆగం కావద్దన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన, సాదాబైనామా, ధరణి వంటి కార్యక్రమాలతో దాదాపుగా సమస్యలు సమసిపోయేలా చేసింది. అయినా అక్కడక్కడ గెట్ల తగాదాలతోపాటు విస్తీర్ణంలో తేడాలున్నాయన్న సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని రూపుమాపేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వేకు వేగంగా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతీ ఇంచును కొలిచి పక్కాగా భూ విస్తీర్ణం లెక్క తేల్చనున్నది. ఇప్పటికే భూముల విస్తీర్ణం, సర్వే నెంబర్లు, ఖాతా నెంబర్ల వివరాలనూ సేకరించినట్లు సర్వే అండ్ భూ రికార్డుల అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21,27,954 ఎకరాల భూములుండగా, 2,87,613 సర్వే నెంబర్లు ఉన్నాయి. వంద శాతం భూ సమస్యలు పరిష్కారం కానుండడంతో ‘డిజిటల్ సర్వే’ అన్నదాతలకు అద్భుత వరంగా మారనున్నది.
ప్రతి ఇంచును కచ్చితంగా కొలిచేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వేకు కసరత్తు చేస్తున్నది. ధరణి అందుబాటులోకి తీసుకురావడంతో చాలా భూ సమస్యలు పరిష్కారంకాగా, డిజిటల్ సర్వే పూర్తయితే భూ సమస్యలు వంద శాతం పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతో భూముల హద్దులు, పోడు భూముల సమస్యలకు పరిష్కారం లభించనుంది. అత్యాధునిక పద్ధతుల్లో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ సర్వే పూర్తి చేసి ప్రతి భూమికి అక్షాంశ రేఖాంశాలను ఇవ్వనున్నారు. అనంతరం భూముల రికార్డులను రెవెన్యూ, సర్వే, భూ రికార్డుల శాఖల అధికారుల సమక్షంలో తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. సంబంధిత భూ యజమానులు అప్పీల్ చేసుకున్నట్లయితే సంబంధిత అప్పీళ్లను పరిష్కరించిన తర్వాతనే తుది రికార్డులను నమోదు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 12.43 లక్షల ఎకరాలు
ప్రభుత్వం భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఖాతా నంబర్ల వివరాలను సేకరించినట్లు జిల్లా సర్వే అండ్ భూరికార్డుల అధికారులు తెలిపారు. జిల్లాలో ఎక్కువగా ఆర్ఎస్ఆర్(ఒక సర్వే నంబర్ ఉండాల్సిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉండడం) భూ సమస్యలు ఉన్నాయి. జిల్లాలోని షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో అధికంగా ఆర్ఎస్ఆర్ భూముల సమస్యలున్నాయి. జిల్లావ్యాప్తంగా 11 వేల ఎకరాల్లో ఆర్ఎస్ఆర్ సమస్యను ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే 1995-2010లో జరిగిన భూ క్రయవిక్రయాలకు సంబంధించి అప్డేట్ చేయకపోవడంతో విక్రయించినప్పటికీ విక్రయదారుడితోపాటు కొనుగోలు దారుడి ఇద్దరి పేరిట ఉండడంతో ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమైంది. ఆర్ఎస్ఆర్ సమస్యను సర్వే నంబర్ల వారీగా సర్వే పూర్తి చేసినట్లయితే భూముల విస్తీర్ణంపై పక్కా లెక్క తేలనున్నది. జిల్లాలో 27 మండలాలు, 601 గ్రామ పంచాయతీలున్నాయి.
జిల్లావ్యాప్తంగా 12,43,098 లక్షల ఎకరాల(5,03,064 హెక్టార్లు) భూములుండగా, 1,67,550 సర్వే నంబర్లు ఉన్నాయి. అదేవిధంగా 3,82, 325 ఖాతాలున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 9673 సర్వే నంబర్లుండగా 28,110 హెక్టార్లు, సరూర్నగర్లో 821-3008 హెక్టార్లు, బాలాపూర్లో 3229-10,621, హయత్నగర్లో 1054 సర్వే నంబర్లలో 2606 ఎకరాలు, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 8894 -24,697, కందుకూరులో 8371-31,332, మంచాల మండలంలో 6717-23,458, యాచారంలో 9294-32,410, మహేశ్వరంలో 8040-26,938, శంకర్పల్లి మండలంలో 8844-20,483, శేరిలింగంపల్లి మండలంలో 3306-9488, రాజేంద్రనగర్ మండలంలో 3034 -5528, గండిపేట్ మండలంలో 3841-12,662, శంషాబాద్ మండలంలో 7470 సర్వేనంబర్లలో 20,191 ఎకరాలు, మొయినాబాద్ మండలంలో 6269-19,338, చేవెళ్ల మండలంలో 9262 -27,574 , షాబాద్ మండలంలో 8589-23,138, నందిగామ మండలంలో 4522 -11,425, కొత్తూరు మండలంలో 3078-8350, ఫారూఖ్నగర్లో 10567-27,965, కేశంపేట్లో 6539-22,528, కొందుర్గు మండలంలో 4659-13,022, చౌదరిగూడ మండలంలో 5233-11,363, కడ్తాల్ మండలంలో 10608-20,587, అమన్గల్లు మండలంలో 3478-13,910, తలకొండపల్లి మండలంలో 5868-24,675, మాడ్గుల మండలంలో 6290 సర్వే నంబర్లుండగా 27,675 హెక్టార్ల విస్తీర్ణంలో భూములున్నాయి.