అనవసరంగా హైదరాబాద్కు పంపొద్దు
అధికారులకు మంత్రి హరీశ్ దిశానిర్దేశం
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): జిల్లా స్థాయిలోనే అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానలకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంపాలని పరిధిలోని దవాఖానలకు సూచించాలని, టీచింగ్ హాస్పిటళ్లలో అందే వైద్యసేవల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యవిద్య పరిధిలోని దవాఖానల పనితీరుపై ఆదివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో సేవలు ఆరోగ్యశ్రీ కింద మరింత ఎకువగా చేయాలని ఆదేశించారు.
పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని చెప్పారు. ప్రణాళిక రూపొందించుకొని ఆపరేషన్ థియేటర్ల వినియోగాన్ని పెంచాలని, మేజర్ సర్జరీలు చేయాలని సూచించారు. శానిటేషన్, డైట్ టెండర్లు వీలైనంత త్వరగా పూర్తి చేసి, సూపరింటెండెంట్, ఆర్ఎంవో దవాఖానల్లో నాణ్యమైన సేవలు అందేలా చూడాలని చెప్పారు. మందులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాయొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నదని, రోగులకు జనరిక్ మెడిసిన్ సూచించాలని, బ్రాండెడ్ ఉండొద్దని తేల్చిచెప్పారు. పార్థివ వాహనాల సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలని తెలిపారు. మార్చురీల ఆధునీకరణ వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. దవాఖానల్లో అన్ని వెంటిలేటర్స్ పనిచేసేలా చూడాలని, అత్యవసర సేవలు 24 గంటలు అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు. సూపరింటెండెంట్లు విభాగం వారీగా వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. వైద్యులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్స్లో ఉండవద్దని పేర్కొన్నారు.
సిద్దిపేట, నిజామాబాద్లో మోకాలి చిప్ప మార్పిళ్లు
గాంధీ, ఉస్మానియాకే పరిమితమైన మోకాలి చిప్పమార్పిళ్ల చికిత్సను సిద్దిపేట, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు విస్తరించామని మంత్రి హరీశ్ తెలిపారు. ఆదివారం మూడు శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన నిజామాబాద్ దవాఖాన సిబ్బందిని అభినందించారు. మధుమేహంతో బాధపడుతున్న రోగులకు అన్ని రకాల సేవలు ఉస్మానియాలోనే అందుతాయని వివరించారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న ఉస్మానియా వైద్యులకు అభినందనలు తెలిపారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలు, ఆర్ఎంవోలు, సీఎస్ ఆర్ఎంవోలు పాల్గొన్నారు.