హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పారిశ్రామికవేత్తల ఇంటారాక్టివ్ సెషన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ‘తెలంగాణ రాష్ట్రం -ఇంధన రంగంలో భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు. 50 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వల్లే ఈ రోజు పారిశ్రామికవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారని వివరించారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది కృషి ఉన్నదని వివరించారు. 2014కు ముందు పారిశ్రామికవేత్తలు ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్పై ఒత్తిడి తెవొద్దని పారిశ్రామికవేత్తలకు మంత్రి హితవు పలికారు. ప్రభుత్వానికున్న సామాజిక బాధ్యతలు దృష్ట్యా ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ఇంధన శాఖా కార్యదర్శి సునీల్ శర్మ, సుమారు 150 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.