హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, అనాలోచిత నిర్ణయాలు తెలంగాణ విద్యుత్తు సంస్థల పాలిట శాపంగా పరిణమించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరితో విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగి డిస్కంలకు భారంగా మారాయి. నరేంద్రమోదీ సర్కార్ బొగ్గు ధరలతోపాటు బొగ్గు రవాణా చార్జీలు, గ్రీన్ సెస్సులను అడ్డగోలుగా పెంచడంతో విద్యుత్తు కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగి ట్రూ అప్ చార్జీలు రూ.12,015 కోట్లకు చేరాయి.
గతంలో టన్నుకు రూ.50గా ఉన్న గ్రీన్ ఎనర్జీ సెస్సును ఒకేసారి రూ.400కు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల అదనపు భారం పడింది. దీనికి తో డు బొగ్గు ధరలను సాలీనా 6 నుంచి 10% మేరకు పెం చడంతో రూ.725 కోట్ల భారం పడింది. మరోవైపు కేంద్రం గత నాలుగేండ్లల్లో బొగ్గు రవాణా చార్జీలను 40% పెంచింది. రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణ విద్యుత్తు సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడింది.
ఈ లోటును పూడ్చేందుకు డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయడంతో మరో రూ.2,763 కోట్ల భారం పడింది. ఏపీ జెన్కో నుంచి రావాల్సిన విద్యుత్తును నిలిపివేయడంతో తెలంగాణ డిస్కంలు రూ.2,502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చింది. వీటి వల్లనే ట్రూ అప్ చార్జీలు పెరిగినట్టు విద్యుత్తు రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జనవరి 18న విచారణ
విద్యుత్తు కొనుగోలుకు అయిన అదనపు వ్యయాన్ని వసూలు చేసుకునేందుకు రాష్ట్రంలోని రెండు డిస్కంలు శనివారం టీఎస్ఈఆర్సీ కార్యాలయంలో రూ.12,015.46 కోట్లకు ట్రూ అప్ చార్జీల పిటిషన్ను దాఖలు చేశాయి. 2016-17 నుంచి 2021-22 కాలానికి తుది పిటిషన్ను, 2022-23 సంవత్సరానికి ప్రొవిజినల్ పిటిషన్ను సమర్పించాయి.
విద్యుత్తు కొనుగోలు అంచనాలకు, వాస్తవిక కొనుగోలు వ్యయానికి మధ్య గల తేడానే ట్రూ అప్ చార్జీలంటారు. ప్రాథమిక అంచనాలకు మించిపోయిన వ్యయా న్ని సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్ను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు తెలిపారు. దీనిపై 2023 జనవరి 18న బహిరంగ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.