హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నీళ్లులేక, కరెంట్ రాక జనం అష్టకష్టాలు పడుతున్నారు. తమ కష్టాలను నాయకులకు చెబుదామంటే అందుబాటులో ఉండరు. అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తాజాగా ఖమ్మం(Khammam) జిల్లాలో రాత్రిపూట కరెంట్ కోతలు జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
గత 3 రోజుల నుంచి రాత్రిపూట కరెంటు కోతలు(Electricity supply) మొదలయ్యాయి. ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న బాగ్లో గత మూడు రోజులుగా రాత్రిపూట 10 గంటల నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు విద్యుత్ ఓవర్ లోడ్ కారణంగా కరెంటు ఉండటం లేదు. రాత్రి కరెంట్ లేదని వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు కరెంట్ కోతలతో మరింత ఇబ్బంది పడుతున్నారు.