Power Cut | అలంపూర్, డిసెంబర్ 24: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు, వంద పడకల దవాఖాన, ఫైర్స్టేషన్కు విద్యుత్తు అధికారులు పవర్ కట్ చేశారు. దీంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది వారం రోజులుగా చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు, కొత్తగా ప్రారంభించిన వంద పడకల దవాఖానకు సంబంధించి మూడు నెలల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదని, వ్యవసాయ మార్కెట్ యార్డుకు రూ.20 వేలు, దవాఖానకు 54 వేల రూపాయల బిల్లు పెండింగ్లో ఉన్నదని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చీకట్లు కమ్ముకున్నాయని, అయినా పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శలొస్తున్నాయి. విద్యుత్తు సరఫరా లేక సిబ్బంది దీపపు వెలుగులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కరెంట్తోపాటు మంచి నీళ్లు కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి హోటళ్లు, పెట్రోల్ బంక్లకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని సిబ్బంది వాపోతున్నారు. వంద పడకల దవాఖానలో రూ.కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు ఉన్నాయి. కరెంట్ లేక చీకటిగా ఉండటంతో అక్కడ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని పరిస్థతులు చక్కదిద్దాలని అక్కడి పలువురు సిబ్బంది కోరుతున్నారు.