Electricity Employees | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ‘వానొచ్చినా, గాలొచ్చినా నిర్విరామంగా రాత్రింబవళ్లు పనులు చేస్తుంటే.. మాకిచ్చే గౌరవమిదేనా? మా జీతాలెక్కువ అని మమ్మల్ని బద్నాం చేస్తారా? కాంగ్రెస్ సర్కార్కు ఉద్యోగులంటే చిన్నచూపు ఎందుకు?’ అంటూ రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పేరుకే తమ జీతాలెక్కువ.. కానీ వచ్చే ఏడాది జీతంలో మూడు నెలల వేతనం పన్నులకే పోతున్నది. ఇక తమకు జీతాలెలా ఎక్కువిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షల జీతాలు తీసుకొనే స్వీపర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కశాతం కూడా ఉండరని, కానీ వారి వేతనాలను చూపి విద్యుత్తు ఉద్యోగులను బద్నాం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. విద్యుత్తు ఉద్యోగుల జీతాలను పీజీసీఎల్, ఎన్టీపీసీ వంటి సంస్థలతో పోల్చాలని విద్యుత్తు ఉద్యోగులంటున్నారు. ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఆయా సంస్థలు అలవెన్సుల రూపంలోనే లక్షలు చెల్లిస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి నాలుగేండ్లకోసారి విద్యుత్తు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పీఆర్సీని పెండింగ్లో పెట్టి జీతాలెక్కువ అంటూ బద్నాం చేయడంపై ఆ శాఖలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అతి ఎక్కువ అసహజ మరణాలు సంభవించేది విద్యుత్తు సంస్థల్లోనే అని ఉద్యోగులు, సంఘాల నేతలు చెప్తున్నారు. నిరంతరం ప్రమాదాలతో పోరాడేది విద్యుత్తు ఉద్యోగులేనని ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం శ్రీశైలం విద్యుత్తు ప్లాంట్ ప్రమాదంలో 9 మంది ఇంజినీర్లు చనిపోయారని పేర్కొంటున్నారు. ఈ 6 మాసాల్లోనే 33 విద్యుత్తు ప్రమాదాలు జరిగితే, 8 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది గాయాల పాలయ్యారని అంటున్నారు.
విద్యుత్తు ఉద్యోగుల వేతనాలెక్కువ అనడం సత్యదూరం. ఎన్టీపీసీ, పీజీసీఎల్ వంటి సంస్థల ఉద్యోగులు, ఇంజినీర్ల జీతాలలో మా జీతాలు పోల్చాలి. లైన్మన్గా స్తంభాలెక్కి , హైవోల్టేజ్ విద్యుత్తులో, విద్యుత్తు ప్లాంట్లల్లో దినదినగండంలా మేం పనిచేస్తున్నాం. ఒక ఏఈ చీఫ్ ఇంజినీర్ కావాలంటే 35 ఏండ్లు పడుతుంది. కొద్దిమంది మాత్రమే ఈ స్థాయికి చేరుకొంటారు.
-పవన్కుమార్ జీ,ఏఈ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
దేశంలో నిరంతరం మరణంతో పోరాడుతూ పనిచేసేది ఒక్క విద్యుత్తు ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడటం దారుణం. రాష్ట్రంలో రెండు లక్షల జీతాలున్న ఉద్యోగుల సంఖ్య ఒక్కశాతం కూడా లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, వేతనాలపై మాట్లాడటం అనుమానాలకు తావిస్తున్నది.
– తుల్జారాంసింగ్, విద్యుత్తు పెన్షనర్
ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకొంటున్న జీతమెంతో ముందు బయటపెట్టాలి. రాష్ట్రంలో 78 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అన్నింటిలో ఒకే జీతాల్లేవు. ఒక శాఖలో జీతాలను పరిగణనలోకి తీసుకొని అందరినీ ఒకే గాటన కట్టడం అత్యంత దారుణం.
-ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో అధ్యక్షుడు