హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అధికారుల వివరాల ప్రకారం.. విద్యుత్తు మీటర్లో జరిగిన అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటే తనకు రూ.40 వేలు ఇవ్వాలని ఎర్రగడ్డ సెక్షన్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) గా పనిచేస్తున్న కేపీ రాజు ఎర్రగడ్డ నేతాజీనగర్కు చెందిన మహ్మద్ అజహర్ సుల్తాన్ను డిమాండ్ చేశాడు. దీనిపై అజహర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాలానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఏఈ రాజు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.