Minister Seethakka | వరంగల్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతుండగా 20 నిమిషాలు కరెంటు కట్ అయ్యింది. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం ఏరియాలో ఆదివారం మంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే కరెంటు పోవడంపై పలువురు సర్కార్ తీరును తప్పుబట్టారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున మంత్రి సీతక్కకు నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నమోదైన వారినే కాకుండా కేసులు నమోదుకాని ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వీరిని ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. ఉద్యమకారుల వేదిక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకుపోతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి, వారి ఆశయాలను అమలుకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రి సీతక్క అధికారులతో ఫోన్లో మాట్లాడగా చివర్లో కరెంట్ రావడంతో అందరూ చప్పట్లు కొట్టారు.