హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో చేపట్టిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని పలువురు విద్యుత్తు కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని మింట్కాంపౌండ్ టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద విద్యుత్తు కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా డిస్కం సీఎండీ ముషారప్ ఫారూఖీని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టర్ల ప్రతినిధి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. డిస్కం పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.124 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉన్నదని తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఎస్ఎస్ఆర్ రేట్లపై తుది నిర్ణయం తీసుకొని వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు శ్రీకాంత్ గుప్తా, బ్రహ్మచారి, స్వామి, గంపకృష్ణ, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.