విద్యుత్తు రంగానికి శాపంగా పరిణమించే సవరణ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విద్యుత్తు ఉద్యోగులు, కార్మిక సంఘాలు జంగ్సైరన్ మోగించాయి. సవరణ బిల్లు విద్యుత్తు రంగాన్ని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికేనని తేల్చి చెప్పాయి. దేశాన్ని కారుచీకట్లలోకి నెట్టే ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా మేధావులు, నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చినా.. పట్టించుకోని కేంద్రం మొండిగా బిల్లు ప్రవేశపెట్టేందుకే సిద్ధమైంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం విద్యుత్తు సౌధలో మహాధర్నాకు కరెంటోళ్లు సన్నద్ధమయ్యారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దేశానికి మంచి రోజులు తెస్తామని నమ్మబలికి జనాన్ని మోసగించిన ప్రధాని నరేంద్రమోదీ.. దేశాన్ని కారుచీకట్లలోకి నెట్టేందుకు సిద్ధయ్యారు. ప్రభుత్వరంగ సంస్థలను, వాటి ఆస్తులను వరుసగా తెగనమ్మి అందినకాడికి సొమ్ము చేసుకొంటున్న ఆయన ప్రభుత్వం.. ఇప్పుడు విద్యుత్తు రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ రంగాన్ని అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా సోమవారం పార్లమెంట్లో విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నది. తద్వారా డిస్కంల విద్యుత్తు లైన్లను రూపాయి ఖర్చు లేకుండా వాడుకొనేలా ప్రైవేట్ సంస్థలకు వీలుకల్పించబోతున్నది.
వ్యవసాయ మీటర్లకు మోటర్లను బిగించి రైతులకు ఉచిత విద్యుత్తు అందకుండా చేయబోతున్నది. విద్యుత్తు వినియోగంలో పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలకు మంగళం పాడబోతున్నది. విద్యుత్తు చార్జీల రూపంలో వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపి అన్ని వర్గాల వెన్ను విరవబోతున్నది. దీని వల్ల దేశానికి, కోట్ల మంది ప్రజలకు చేటు తప్పదని విద్యుత్తు రంగానికి చెందిన ఎంతో మంది నిపుణులు, మేధావులు ఘోషిస్తున్నా మోదీ సర్కార్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగబోతున్నాయి. సోమవారం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో పలు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఆయా సంఘాల నేతలు ఆదివారం హైదరాబాద్లో వేర్వేరుగా సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ సర్కారు దిగిరాకపోతే నిరవధిక పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. ఈ బిల్లు ను పార్లమెంట్లో ప్రవేశపెడితే బీజేపీ ఎంపీలు, నాయకులు, మంత్రుల ఇండ్లకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ చట్టంతో విద్యుత్తు వినియోగదారులకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విద్యుత్తుసౌధలో నేడు మహాధర్నా
విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమాజిగూడలోని విద్యుత్తుసౌధలో సోమవారం మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేత, విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి పీ రత్నాకర్రావు వెల్లడించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి మహాధర్నాలో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ ఆందోళనల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పారు. విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన వ్యక్తంచేసి, తమ ఉద్యమానికి బాసటగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై కేంద్రం ముందుకెళ్తే నిరవధిక సమ్మెకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని రత్నాకర్రావు ప్రకటించారు.
విద్యుత్తు మహా ధర్నా పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరిస్తున్న తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, విద్యుత్తు జేఏసీ ప్రతినిధులు
కేంద్రంపై సమరశంఖం పూరిద్దాం: వీఏవోఏటీ
పేదలకు శాపంగా పరిణమించనున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విధుల బహిష్కరణ, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్టు విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య ప్రకటించారు. సోమవారం ఉద్యోగులంతా విధులను బహిష్కరించి, కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు. సోమవారం మింట్ కాంపౌండ్లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు భారీగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ కుట్రలపై సమరశంఖం పూరించాలన్నారు. విద్యుత్తు రంగాన్ని అంధకారంలోకి నెట్టే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులతోపాటు మేధావులంతా గళమెత్తాలని కోరారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచే విధుల బహిష్కరణ: టీఈఈ జేఏసీ
విద్యుత్తు సవరణ బిల్లును నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచే విధులను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) జేఏసీ నేతలు కోడూరి ప్రకాశ్, ఎన్ శివాజీ వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి అన్ని విద్యుత్తు సంస్థలు, పవర్ జనరేటింగ్ స్టేషన్లు, సర్కిల్, డివిజినల్ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు సబ్స్టేషన్లల్లో పనిచేసేవారు మాత్రం విధులకు హాజరుకావాలని సూచించారు. విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని, ఈ సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు.