హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వాణిజ్య రంగంలో ఉన్న ఏ ప్రైవేటు సంస్థలైనా లాభాపేక్షతోనే పనిచేస్తుంటాయి. ఉత్పత్తి వ్యయంతోపాటు ఇతర ఖర్చులను, లాభాన్ని కలుపుకొని తమ వస్తువులను విక్రయిస్తుంటాయి. ఉత్పత్తి వ్యయం ఏమాత్రం పెరిగినా ఆ భారాన్ని వినియోగదారులపైనే వేస్తుంటాయి. కానీ ప్రభుత్వరంగంలోని సంస్థలు నష్టాలొస్తున్నా ప్రజలకు సేవలందించేందుకు వెనుకాడవు. ఇక సంక్షేమ ప్రభుత్వాలు పాలనలో ఉంటే ఆ నష్టాలను ప్రజలపైకి బదలాయించేందుకు ఏమాత్రం ఇష్టపడవు. కానీ కాలం మారుతున్న క్రమంలో ప్రజల జీవనస్థితిగతులు మారడంతోపాటు వారి కొనుగోలుశక్తి కూడా పెరుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పొందే సేవలు పదేండ్ల క్రితం ఉన్న ధరకే ఇప్పుడు కూడా అందించాలని కోరడం సహేతుకం కాదు. రాష్ట్రంలో ఒక క్యాటగిరీ వారికి అందిస్తున్న విద్యుత్ ధరను రెండు దశాబ్దాలుగా మార్చనే లేదు. ఇక ఇతర క్యాటగిరీల వారికి అందిస్తున్న విద్యుత్తు ధరలు కూడా ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రంగాల వారికి 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. ఓ వైపు ఉత్పత్తి, నిర్వహణ, పంపిణీ వ్యయం పెరుగుతున్నా గత ఏడేండ్లుగా ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచలేదు. ఇప్పుడు ఖర్చు బారెడు.. ఆదాయం మూరెడులా తయారైంది విద్యుత్తు రంగం పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలపై మోయగలిగిన భారాన్ని మోపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
20 ఏండ్ల నుంచే ఒకటే ధర
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారుల నుంచి స్లాబ్ల వారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గృహాలు, వాణిజ్యం, పరిశ్రమల నుంచి చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం, వ్యవసాయానికి మాత్రం ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నది. వ్యవసాయం మినహా ఇతర రంగాలవారి నుంచి వేర్వేరు రేట్లను వసూలు చేస్తున్నారు. ఇక గృహ వినియోగదారులను కూడా వారి విద్యుత్తు వినియోగాన్ని బట్టి స్లాబ్లుగా విభజించారు. నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి యూనిట్కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ధరను 20 ఏండ్ల క్రితం ఖరారుచేశారు. నాటికీ నేటికీ వినియోగదారుల సంఖ్య లక్షల్లో, యూనిట్ల వినియోగం కోట్లల్లో పెరిగింది. అయినప్పటికీ తెలంగాణలో మాత్రం అదే పాత రేటును కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ర్టాలలో ఇదే స్లాబ్కు ఇంతకన్నా నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.
ఫిక్స్డ్ చార్జీలు లేని రాష్ట్రం..
ఇతర రాష్ర్టాల్లో ఫిక్స్డ్ చార్జీల పేరుతో బాదుతున్నా.. తెలంగాణలో మాత్రం 0-50 యూనిట్ల స్లాబ్లో ఫిక్స్డ్ చార్జీగా ఒక్క పైసాకూడా వసూలు చేయడం లేదు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఒక కేవీ లోడుకు రూ.110 చొప్పున ఫిక్స్డ్ చార్జీలను వసూలు చేస్తుండగా.. మహారాష్ట్ర రూ.102 వసూలు చేస్తున్నది. కానీ తెలంగాణలో ఒక్కపైసా కూడా పేదవారిపై భారం మోపకుండా.. కేవలం యూనిట్కు రూ. 1.45 పైసలు మాత్రం వసూలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా యూని ట్ విద్యుత్తును రూ.5.50 పైసలకు అందిస్తుండగా.. పశ్చిమబెంగాల్లో రూ. 5.29 పైసలకు గుజరాత్లో రూ.4.84 పైసలకు అందిస్తున్నారు. దీనికితోడు ఈ రాష్ర్టాలన్నింటిలో ఫిక్స్డ్ చార్జీల పేరిట అదనపు భారాన్ని మోపుతున్నారు.
మన దగ్గరే అతి తక్కువ ధరలు
ఇతర రాష్ర్టాలతో పోల్చితే.. మన రాష్ట్రంలోనే విద్యుత్తు చార్జీలు (యూనిట్కు) అతి తక్కువగా ఉన్నట్టుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెద్ద రాష్ర్టాలుగా చెప్పుకొనే గుజరాత్ నుంచి కేరళ వరకు విద్యుత్తు చార్జీలు మనకన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. గృహ వినియోగదారుల్లో ముఖ్యమైన 0-50 యూనిట్ల శ్లాబ్ను పరిశీలిస్తే ఈ విషయం మనంకు తేటతెల్లం అవుతుంది.