హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ క్రమంలో ఇటీవలే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరగనుండటంతో ఆశావహులంతా అదృష్టాన్ని పరీక్షించుకునే యోచనలో పడ్డారు. సిట్టింగ్ స్థానంపై పీఆర్టీయూటీఎస్ గురిపెట్టి ఓటరు నమోదును ప్రారంభించింది. పీఆర్టీయూ టీఎస్ నుంచి కాటేపల్లి జనార్దన్రెడ్డితోపాటు మరికొందరు సైతం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. టీఎస్ యూటీఎఫ్, ఎస్టీయూ, తపస్ తదితర సంఘాలు సైతం తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మొదట్లో ఎస్టీయూ.. ఆ తర్వాత పీఆర్టీయూ
శాసన మండలి రద్దుకు ముందు ఎస్టీయూ, పునరుద్ధరణ తర్వాత జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ హవా సాగింది. ఎస్టీయూ, పీఆర్టీయూకు చెందిన పలువురు అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీచేసి గెలుపొందారు. మొదట్లో హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలు కలిపి ఒక నియోజకవర్గంగా ఉండేది. 1952లో కొండపర్తి మనోహన్రావు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి వీపీ రాఘవాచారి ఒకసారి ఏకగ్రీవంగా, రెండు పర్యాయాలు ఎన్నికల ద్వారా మొత్తంగా మూడుసార్లు మండలికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత శ్యాంసుందర్రావు ఎస్టీయూ నుంచి ప్రాతినిథ్యం వహించగా, పీఆర్టీయూ నుంచి జగపతిరావు ఒక పర్యాయం గెలిచారు. ఆ తర్వాత 1989లో మండలి రద్దయ్యింది. 2007లో మండలి పునరుద్ధరణ తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడగా, పీఆర్టీయూ అభ్యర్థి పాతూరి సుధాకర్రెడ్డి గెలుపొందారు. నాలుగేండ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత 2011లో ఎన్నికలు జరగగా, పీఆర్టీయూ బలపర్చిన కాటేపల్లి జనార్దన్రెడ్డి విజయం సాధించారు. 2017ఎన్నికల్లోను టీఆర్ఎస్ బలపర్చడంతో విజయం జనార్దన్రెడ్డినే వరించింది.