హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే లా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, అనంతరామన్ కమిషన్ నివేదిక మేరకు వర్గీకరణ చేయాలంటూ నొమాడిక్, సెమి నొమాడిక్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘విద్య, ఉపాధి కల్పనలో సంచార జాతులతోపాటు నోటిఫై చేయని తెగలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.
బీసీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరణ చేయాలి. లేకపోతే బీసీల్లో బలవంతులే రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు. బీసీల్లో అందరికీ సమన్యాయం జరగాలంటే రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలి. ఈ విషయాన్ని గతంలోనే అనంతరామన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వర్గీకరణ చేసే వరకు రిజర్వేషన్లను 25శాతం నుంచి 42 శాతానికి పెంపుదల చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9 అమలును నిలిపివేయాలి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించా రు. అనంతరం గతంలో దాఖలైన పిటిషన్లను దీనిని జత చేయాలని, ఈ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను డిసెంబర్ మూడుకు వాయిదా వేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, కార్యదర్శి ధనుంజయనాయుడు తెలిపారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ 15న జిల్లా, మండల, మున్సిపల్ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.