మంచిర్యాల, డిసెంబర్ 2: ఎన్నికలు అనగా నే ఓటర్ల కోసం సవాలక్ష సౌకర్యాలు చేయటం చూస్తుంటాం. కానీ, ఎన్నికల సిబ్బందిని అంత గా పట్టించుకోరు. డ్యూటీకి వచ్చారు కాబట్టి వాళ్లకు టీ, టిఫిన్, భోజనం పెట్టేసి మమ అనిపించటం కామన్. అయితే, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో గొప్ప అనుభూతి కల్పించే సౌకర్యాలు కల్పించారు. సిబ్బంది రాగానే వారికి మంగళహారతులు, పూల బొకేలతో స్వాగతం పలికారు.
పోలింగ్ కేంద్రానికి ఒక రోజు ముందుగానే రావాల్సి ఉండగా, వారికి ఆ రోజు రాత్రి నచ్చిన భోజనం అందించారు. అన్నింటికన్నా ముఖ్యం గా ఉదయం నిద్ర లేవగానే వారికోసం స్నానానికి వేడినీళ్లు సబ్బు, టూత్పేస్ట్ ఇచ్చారు. విధులకు హాజరయ్యేలోపే టీ, టిఫిన్ వారి ముందుంచారు. మధ్యాహ్నానికి రుచికరమైన భోజనం, మంచినీటిని అందించారు. పోలింగ్ ముగిసిన తర్వాత కవర్లు, ఇతర సామగ్రిని సులభంగా ప్యాకింగ్ చేసుకొనేలా సౌకర్యాలు కల్పించారు. అడిషనల్ కలెక్టర్ తానే స్వయంగా రాసిన ప్రశంసాపత్రాలతో సిబ్బందిని సత్కరించారు.
పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడికక్కడే రెమ్యునరేషన్ అందించడం విశేషం. చివరికి ఇంటికి చేరుకోవటానికి కూడా బస్సు సౌకర్యం కల్పించటంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు హాజరైన ఓ పీఈటీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల విధులకు హాజరవటం వివాహ వేడుకకు వచ్చినట్టు ఉన్నదని వెల్లడించారు. తన 24 ఏండ్ల సర్వీసులో ఇలా ఆనందంగా ఎన్నికల విధులు నిర్వర్తించిన సందర్భాలు లేవని తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో పలికిన స్వాగతానికి ఎన్నికల సిబ్బంది, భద్రతాసిబ్బంది అంతా ఆశ్చర్యపోయామని పేర్కొన్నారు.