హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో)లు, అస్టిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీవో)లు మినహా మిగతా సిబ్బంది అందరికీ 2 వారాల్లోగా అన్ని రకాల శిక్షణలు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. డిస్ట్రిక్ లెవల్ మాస్టర్ ట్రైనర్ (డీఎల్ఎంటీ)లకు సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. డాటా ఎంట్రీ, స్ట్రాంగ్రూమ్ల నుంచి ఈవీఎంలు, వీవీపాట్ల తరలింపు, పోలింగ్ తర్వాత మళ్లీ వాటిని సురక్షితంగా భద్రపర్చడం, ఎంసీసీ రిపోర్టింగ్, వెబ్కాస్టింగ్ తదితర కీలక అంశాలకు సంబంధించిన శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర పోషించే క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని రకాలుగా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవోలు అబ్దుల్, హరిసింగ్ పాల్గొన్నారు.