Sunil Kanugolu | హైదరాబాద్, జులై 19(నమస్తే తెలంగాణ): ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పినట్టు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అతి జోక్యాన్ని భరించలేకనే తప్పుకున్నట్టు సమాచారం. తన మనుషులకు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని రేవంత్ ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ వ్యవహారశైలి మారిపోవడంతో ఇద్దరి మధ్య బంధం బీటలు వారినట్టు సమాచారం.
తన సర్వేల్లో రేవంత్ అతిగా జోక్యం చేసుకుంటున్నారని పలువురు నేతల వద్ద సునీల్ వాపోయినట్టు తెలిసింది. టికెట్ల విషయంలో ఆయన ఇచ్చే నివేదికనే అధిష్ఠానం ప్రామాణికంగా తీసుకుంటుంది కాబట్టి తాను చెప్పిన వారికి పాజిటివ్గా, వ్యతిరేకించే వారికి నెగటివ్గా రిపోర్టులు ఇవ్వాలని రేవంత్ ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతున్నది. అలా ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ రేవంత్ వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ వ్యూహకర్తగా సునీల్ వైదొలగినట్టు చెప్తున్నారు. ఆయన తన మకాంను బెంగళూరుకు మార్చినట్టు తెలుస్తున్నది.