నిజామాబాద్: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అడ్డుకట్టవేయడానికి విస్తృత తనిఖీలు చేస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారు, వెండిని సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం రూ.300కోట్లకుపైగా సొత్తును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.307.02కోట్లు విలువైన నగదు, మద్యం, ఆభరణాలను పట్టుకున్నారు. అక్టోబర్ 9 నుంచి రూ.105.58కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.13.58కోట్ల విలువైన మద్యం, రూ.15.23కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.145.67 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఓటర్లను ప్రభావితం చేసేందుకు సిద్ధం చేసిన రూ.26.93కోట్ల విలువైన ఇతర కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు.