హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత నెల రోజుల్లోనే రాజకీయ పార్టీలు తమ సభలకు సుమారు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలతోపాటు న్యూఇయర్ వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలను కేటాయించింది.
దీనిలోనే ఎన్నికల అంశాన్ని కూడా చేర్చింది. దీంతో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు ఆదాయం సమకూరనున్నది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉన్నది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులనూ సిద్ధం చేసి రోడ్లపై తిప్పుతున్నారు. గత నెల కొల్లాపూర్లో సీఎం కేసీఆర్ సభకు 2 వేల బస్సులను, ప్రధాని మోదీ మహబూబ్నగర్లో, నిజామాబాద్లో నిర్వహించిన సభలకు 2 వేల బస్సులను బీఆర్ఎస్, బీజేపీ నేతలు బుక్ చేశారు. ఇటీవల రాహుల్ సభలకూ ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు.
ఇటీవల సీఎం కేసీఆర్ పాల్గొన్న సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట సభలకూ కొన్ని ఆర్టీసీ బస్సులను వినియోగించారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్షా పాల్గొన్న సభల్లో కూడా కొన్ని బస్సులు వినియోగించారు. ఇలా గత నెలరోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు దాదాపు 12 వేలకు పైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఇంకో నెలరోజుల పాటు ఎన్నికల ప్రచార సభలు ఉండటంతో ఆర్టీసీకి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది.