హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.
కాగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. పోటీచేయాలనున్న అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.