హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేసే విషయంలో ఈసీ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎన్ సురేశ్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అందజేశామని చెప్పారు. ఈ నెల 28వ తేదీ నాటికి 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హకును వినియోగించుకున్నారని వివరించారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్పై విచారణను మూసివేసింది.