హైదరాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ దురుద్దేశంతో చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలువరించింది. అభ్యంతరకరమైన టైటిల్తో బీజేపీ దుష్ప్రచారం చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే టైటిల్తో పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీ నేతలను కించపరిచేలా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని స్పష్టంచేసింది. పోస్టర్ల ముద్రణకు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కోసం బీజేపీ చేసిన దరఖాస్తును ఈసీ తోసిపుచ్చింది.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ముద్రించే కరపత్రాలు, పోస్టర్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధనను అమల్లోకి తెస్తూ.. 2019 ఎన్నికలకు ముందు మీడియా సర్టిఫికేషన్ కమిటీని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ అనుమతించిన పోస్టర్లను మాత్రమే రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. జాతీయ పార్టీలు ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో తాము చేసే ప్రచారానికి సంబంధించిన అన్ని విషయాలపై సర్టిఫికేషన్ కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనుమతించని ప్రచార సామగ్రిని ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకొనే అధికారం కూడా మీడియా సర్టిఫికేషన్ కమిటీకి ఉంటుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అభ్యంతరకరమైన టైటిల్తో పోస్టర్లు ముద్రించేందుకు అనుమతికోరగా.. ఈసీ అందుకు నిరాకరించింది. ప్రచార టైటిల్, సీఎం ఫోటోలు వాడిన విధానం, వాటికి పెడుతున్న క్యాప్షన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని మీడియా సర్టిఫికేషన్ కమిటీ స్పష్టంచేసింది.