హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మాడల్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నగదు, మద్యం, తాయిలా పంపిణీపై నిఘా పెట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం బీఆర్కేఆర్ భవన్ నుంచి రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగదు రవాణా, బ్యాంకుల నుంచి డ్రా, డిపాజిట్ చేయడంపై నిఘా పెట్టాలని చెప్పారు. తనిఖీలు చేపట్టాలని, రాజకీయ పార్టీల నగదును, ఉచిత బహుమతులు ఇవ్వాలని చూసిన వాటిని సీజ్ చేయాలని సూచించారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలా వ్యవహరించవద్దని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంసీసీ అమలుపై రాజకీయ పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, అడిషనల్ సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి, నోడల్ అధికారి మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.