భద్రాద్రి కొత్తగూడెం : ఓ ఇద్దరు వృద్ధ దంపతులు నిరంతరం కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బు చెదల పాలైంది. చేతకాని తనంలో ఆ డబ్బే దిక్కు అనుకొని.. భద్రంగా దాచుకున్నారు. కానీ ఆ నగదును చెదలు తినేశాయి. ఇప్పుడు తమ బతుకు ఎలా అని ఆ దంపతులిద్దరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సంజయ్ నగర్కు చెందిన గడ్డం లక్ష్మయ్య తన భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. వీరికి సంతానం కలగలేదు. లక్ష్మయ్య మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక తాను సంపాదించిన డబ్బును పీవీసీ సూట్కేసులో భద్ర పరిచాడు. వయసు మీద పడుతుండటంతో.. ఆ నగదుతో బతుకొచ్చని భద్రంగా ఉంచాడు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడక్కడ చెదలు కూడా వచ్చింది.
ఈ క్రమంలో సూట్కేసు తీసి చూడగా, అందులో ఉన్న డబ్బును చెదలు తినేశాయి. రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు పూర్తిగా చిన్న చిన్న ముక్కలుగా మారాయి. అయితే స్థానికుల సూచన మేరకు ఇల్లెందులోని బ్యాంకుల చుట్టూ తిరిగారు. కానీ ఆ నోట్ల మార్పిడి జరగలేదు. హైదరాబాద్ వెళ్లాలని స్థానిక బ్యాంకుల అధికారులు వారికి సూచించారు. ఇక హైదరాబాద్కు వెళ్లే స్థోమత తమకు లేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బ్యాంకు ఖాతా లేకపోవడంతోనే, ఇంట్లోనే నగదు దాచామని దంపతులు పేర్కొన్నారు.