సంస్థాన్ నారాయణపురం, మే 16: తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురంలో సోమవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్ (19) చౌటుప్పల్లోని ఓ పంక్చర్ షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పని నిమిత్తం సంస్థాన్ నారాయణపురం వెళ్లొస్తుండగా గుడిమల్కాపురం శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది.
కుటుంబీకులు హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. షరీఫ్ బాబాయి కూతురు సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుర్లకుంటకు చెందిన షేక్ ఖాదర్బీ (30) అంత్యక్రియలకు హాజరైంది. తమ్ముడి మృతదేహంపై పడి విలపిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందింది. ఒకేరోజు అక్కాతమ్ముడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. షేక్ ఖాదర్బీకి భర్త, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.