దూద్ కా దూద్.. పానీ కా పానీ..!
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా, ఎంతగా సమర్థించుకున్నా.. నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కారు ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా.. కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించినదన్నది వాస్తవం. గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ను కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కారు అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్తు ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరముందంటూ చేతులు దులిపేసుకున్నది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకారం తెలిపినట్టయ్యింది.
KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్లో ఈ విషయం స్పష్టంగా తేలిపోయింది. నాగార్జునసాగర్ డ్యామ్ ఉదంతంపై జనవరి17న ఇరు రాష్ర్టాలతో కేంద్ర జల్శక్తిశాఖ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కొనసాగింపుగా ఇరు రాష్ర్టాల ఈఎన్సీలతో కేఆర్ఎంబీ గురువారం సమావేశం నిర్వహించింది. అందులో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ర్టాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేఆర్ఎంబీ మినిట్స్లో నమోదు చేసి శుక్రవారం విడుదల చేసింది.