హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : వేసవికి ముందే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు రానున్న వానకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు స్కైమెట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. వానకాలంపై ఎల్నినో ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. ముఖ్యంగా మే నుంచి ఆగస్టు వరకు ఎల్నినో ఎఫెక్ట్ 50 నుంచి 61 శాతం వరకు ఉండవచ్చని, ఇది అక్టోబర్ వరకూ కొనసాగే ప్రమాదం ఉన్నదని స్కైమెట్ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడి సుదీర్ఘకాలం పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో వర్షాధార పంటలు సాగుచేసే రైతులు పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండనున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు సూక్ష్మసేద్యం(డ్రిప్, స్ప్రింక్లర్) పద్ధతులను అవలంబించడంతో నీటి ఎద్దడి నుంచి కొంతమేర బయటపడవచ్చని పేర్కొంటున్నారు. ఐఎండీ నుంచి ఏప్రిల్లో వచ్చే తుది నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు మార్చి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తున్నది.