ముంబై, జూలై 3: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 288 మంది సభ్యుల గల అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144. బీజేపీ-106, శివసేన రెబల్స్-39 మంది, పలు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు ఉన్నది. రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శాసనసభ కొత్త స్పీకర్గా రాహుల్ నర్వేకర్ను ఎన్నుకున్నారు. నర్వేకర్కు మద్దతుగా 164 మంది ఓటేశారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రంజన్ సాల్వికి 107 ఓట్లు వచ్చాయి. మండలి చైర్మన్గా ఉన్న ఎన్సీపీ నేత రామ్రాజేకు రాహుల్ నర్వేకర్ స్వయానా అల్లుడు కావడం గమనార్హం. రెబల్ ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రతతో అసెంబ్లీకి తీసుకురావడంపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ‘కసబ్కు కూడా ఇంత సెక్యూరిటీ కల్పించలేదు. ఎవరైనా క్యాంపు నుంచి పారిపోతారని భయపడుతున్నారా?’ సీఎం ఏక్నాథ్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
ఆర్నెల్లలో సర్కార్ కూలిపోవచ్చు: పవార్
ఎన్సీపీ నేత శరద్పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే ప్రభుత్వం ఆర్నెల్లలో కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదివారం పేర్కొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. షిండేకు మద్దతు పలికిన రెబల్స్లో అనేక మందికి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదని, క్యాబినెట్ విస్తరణతో వారిలో అసంతృప్తి బయటకు వస్తుందన్నారు.