హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా విభజన సమస్యలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. పెద్దన్నలా వ్యవహరించి విభజన చట్టం ప్రకారం సంస్థలను విభజించి, ఆస్తులను పంపిణీ చేయాల్సిన కేంద్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు విభజన సమస్యలపై 25 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ ఏడాదిలోనే మూడుసార్లు భేటీ అయ్యారు. ఈ నెల 27న నాలుగోసారి సమావేశం కానున్నారు. తెలంగాణ ఆస్తులపై కన్నేసిన ఏపీ పెడుతున్న మడత పేచీలను విభజన చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాల్సిన కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.
ఫలితంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అపరిష్కృతంగా ఉన్నది. చట్టంలో పొందుపరచని సంస్థలతోపాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి, సింగరేణికి చెందిన హెవీ మెషినరీ లిమిటెడ్ సంస్థలపై పీటముడి కొనసాగుతున్నది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ఆస్తుల విభజనలో చట్టం ప్రకారం ప్రధాన కార్యాలయాన్ని 58:42 నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తుల్లో తమకు వాటా కావాలని ఏపీ తిరకాసు పెట్టింది. ఇలా తెలంగాణ భూములు తమకు కావాలని ఏపీ డిమాండ్ చేస్తే, చట్టం ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టంచేసి, ఏపీని నివారించాల్సిన కేంద్రం.. కావాలని తెలంగాణకు నష్టం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలున్నాయి.
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై ఏపీకి కన్ను కుట్టింది. ఇక్కడి ఆదాయంలో వాటా కావాలని కొత్త పేచీ పె ట్టింది. హైదరాబాద్లో వసూలయ్యే పన్నులో వాటా కావాలని, విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ చెప్తున్నది. దీనిపై తెలంగాణ సీరియస్ అయింది. ఇప్పటికే తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం, ఇంకా రాష్ర్టానికి తీరని అన్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టింది. నిధులు ఇవ్వకుండా ఆంక్షలు పెట్టిన కేంద్రం..ఈ నెల 27న జరిగే సమావేశంలో తెలంగాణ మాట ఆలకిస్తుందా? లేక ఇష్టం వచ్చినట్టుగా వ్యహరించి తెలంగాణకు అన్యాయం చేస్తుందా? అనే సందేహాలు తెలంగాణవాదుల్లో వ్యక్తమవుతున్నాయి.