ఆర్కేపురం/నేరేడుచర్ల, మే 8: అమెరికా టెక్సాస్లోని ఓ షాపింగ్ మాల్లో శనివారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వారిలో మృతుల్లో హైదరాబాద్ యువతి కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి నర్సిరెడ్డి కూతురు తాటికొండ ఐశ్వర్య (27) ఎంఎస్ చదవడం కోసం మూడేండ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తయ్యాక పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న (ఇండియా కాలమానం ప్రకారం ఈ నెల 6న శనివారం రాత్రి) కుటుంబసభ్యులతో ఐశ్వర్య ఫోన్లో మాట్లాడారు. అనంతరం సమీపంలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లారు. మాల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో మొత్తం ఎనిమిది దుర్మరణం చెందారు. వారిలో ఐశ్వర్య కూడా ఉంది. గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఐశ్వర్యను వేలిముద్రల ఆధారంగా అక్కడి పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. ఆమె తాత మాజీ ఎంపీపీ తాటికొండ రామనర్సింహారెడ్డి. ఆయన చిన్న కుమారుడైన నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి. కొన్నేండ్లుగా ఐశ్వర్య తల్లిదండ్రులు సరూర్నగర్లో నివాసం ఉంటున్నారు. కూతురు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయాయి. నేరేడుచర్లతోపాటు సరూర్నగర్లో కూడా విషాదఛాయలు నెలకొన్నాయి.
నర్సిరెడ్డిని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్రెడ్డి, నర్సిరెడ్డి కుటుంబసభ్యులను పట్నా హైకోర్టు జస్టిస్ అభిషేక్రెడ్డి, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్లాల్, రంగారెడ్డి జిల్లా కోర్టు పీపీ రాజిరెడ్డితోపాటు తదితరులు పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సిరెడ్డి కుమారుడికి నిరుడు వివాహం జరిపించారు. ప్రస్తుతం ఐశ్వర్యకు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఐశ్వర్య మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలోని దౌత్యకార్యాలయంతో మాట్లాడినట్టు ట్విట్టర్లో వెల్లడించారు.