చెల్లించేందుకు టీఎన్జీవోల అంగీకారం
మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం
సానుకూలంగా స్పందించిన మంత్రి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2 శాతం చెల్లించేందుకు తాము సిద్ధమని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ స్కీమ్ను ఈహెచ్ఎస్ ట్రస్ట్ ద్వారా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. పీఆర్సీ కమిటీ నివేదికలో ఉద్యోగుల మూల వేతనం నుంచి 1 శాతం ఈహెచ్ఎస్కు ఇవ్వాలని సూచించగా, దానికి అదనంగా ఒకశాతం కలిపి, మొత్తంగా 2 శాతం మూలవేతనం నుంచి ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పీఆర్సీ కమిటీ 7 శాతం వేతన సవరణ చేయాలని సూచించగా, ఉద్యోగుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 30 శాతం పీఆర్సీ ఇచ్చారని, అలాంటిది తాము ఈహెచ్ఎస్కు రెండు శాతం ఇవ్వడం సముచితమని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో ఇక నుంచి నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని అందించాలని కోరగా, గురువారమే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులిస్తామని మంత్రి హరీశ్రావు తమకు హామీ ఇచ్చారని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్ వెల్లడించారు. తమ చిరకాల కోరిక అయిన ఈహెచ్ఎస్ అమలుకు సానుకూలంగా స్పందించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.