జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సంస్కరణ దిశలో సాగుతుందని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 1.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్డడీ సర్కిల్ను మంత్రి కొప్పుల సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన గొప్ప ఫలితాలను అందజేస్తుందన్నారు.
జిల్లాల ఏర్పాటు అనంతరం ఒకొక్కటిగా సౌకర్యాలను చేకూర్చుకుంటున్నామన్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన జగిత్యాల నేడు అభివృద్థి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కేటగిరిలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన భోజనం, నాణ్యమైన బోధనలతో తెలంగాణ గురుకులాలు నేడు సంచలనాలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు.
రూ. 1.15 కోట్ల వ్యయంతో అన్నిరకాల హంగులతో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశామన్నారు. వంద మంది విద్యార్థులకు ఐదు మాసాల పాటు స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు శిక్షణ ఇస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఐదు మాసాల పాటు, ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు స్టడీ సర్కిల్లోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్లో పోటీ పరీక్షలకు బోధన చేసే ఫ్యాకల్టీతోనే జగిత్యాల స్టడీ సర్కిల్లోను బోధన చేయిస్తామన్నారు. విద్యార్థులు స్టడీ సర్కిల్ను వినియోగించుకొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.