బాసర/వికారాబాద్ (నమస్తేతెలంగాణ), జూన్ 15: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటన మరువక ముందే గురువారం మరో విషాదం చోటు చేసుకున్నది. ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత గర్ల్స్ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడింది. అపస్మారక స్థితిలో ఉన్న లిఖితను చికిత్స కోసం ట్రిపుల్ ఐటీ అధికారులు భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అక్కడి వైద్యుల సూచనల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. లిఖితను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ వెంకటరమణ నిర్మల్లోని దవాఖానకు చేరుకున్నారు. లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు, బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. విద్యార్థిని మరణం పట్ల వీసీ, ట్రిపుల్ ఐటీ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ రీడింగ్ రూమ్ను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొన్న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటనపై కమిటీ వేశామని, విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. తాజా ఘటనకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని వీసీని ఆదేశించామని, పూర్తి సమాచారం అందిన వెంటనే మీడియాకు అన్ని విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి సూచించారు.