హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత స్టడీ మెటీరియల్ను ఇంటర్బోర్డు అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సెకండియర్లోని విద్యార్థులకు ఈ నెలలోనే ఫస్టియర్ పరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ స్టడీ మెటీరియల్ రూపొందించారు. స్టడీ మెటీరియల్స్ను విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి మంగళవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన స్టడీ మెటీరియల్ మంగళవారం నుంచి www.tsbie.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. మిగతా సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. పరీక్షల్లో 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇస్తున్నామని ఇంటర్బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టుల మోడల్ ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో పెట్టామని, వాటిని డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.