హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలను సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయని చెప్పారు. కనుక, విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలపై నిఘా ఉంచడమేగాక, పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సబిత తెలిపారు. పరీక్ష కేంద్రాలకు నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.