హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపైనే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా డీఈవోలకు, హెచ్ఎంలకు, టీచర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. బడిబాటలో అత్యధికంగా నమోదైన టాప్ -3 జిల్లాలు, రాష్ట్రంలోని టాప్ -10 పాఠశాలలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం బడిబాట షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ఈ నెల 31లోపు జిల్లాస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఇతర శాఖలు, అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. జూన్ 1న మండల, జిల్లాస్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 1న గ్రామ సభ నిర్వహించి సర్పంచ్ ఎస్ఎంసీ సహా అందరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. జూన్ 12 నుంచి 17 వరకు షెడ్యూల్ ప్రకారం బడుల్లో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అంతేగాక, జిల్లా, మండలాల్లో బడిబాట హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసి, రోజువారీ ఎన్రోల్మెంట్ వివరాలను అందజేయాలని ఆదేశించారు. బడి బయటి చిన్నారులను గుర్తించేందుకు స్వయం సహాయక బృందాల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.
ఎన్రోల్మెంట్ డ్రైవ్..
సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ను పెంచడం, ప్రభుత్వ బడులకు పిల్లలు వచ్చేలా చూడటం, బడుల్లో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేసేందుకు ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది రెండుగా విభజించారు. జూన్ 3 నుంచి 9 వరకు కేవలం అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి 17 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలుంటాయి. ఇందులో భాగంగా టీచర్లంతా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ డ్రైవ్ను చేపట్టి.. డోర్ టూ డోర్ క్యాంపెయిన్, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ చేపడుతారు. ఇంగ్లిష్మీడియం చదువు, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. బాలకార్మికులు, బడి బయట ఉన్న చిన్నారులను నమోదుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తారు.
బడిబాట షెడ్యూల్..తేదీ కార్యక్రమాలు