హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించాలా? లేక హైస్కూల్ నుంచి ప్రారంభించాలా? అన్నది విద్యాశాఖ తేల్చలేకపోతున్నది. ప్రీ ప్రైమరీ నుంచి ప్రారంభించాలన్న వాదనలున్నాయి. మొత్తం మీద ఏ స్థాయి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్న చర్చలు సాగిస్తున్నది. రాష్ట్రంలో మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది.
తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో 632 మండలాలు ఉండగా, అంతటా ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వీటికి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా పేరు ఖరారు చేసింది. ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలో ఈ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు బడ్జెట్లో రూ. 500 కోట్లను కేటాయించింది. వీటి ఏర్పాటుకు ఎంత స్థలం అవసరమవుతుంది? భూమి గుర్తింపు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇక ఈ భవనాల డిజైన్లు ఇటీవలే అధికారులు రూపొందించి, సీఎం రేవంత్రెడ్డి ఆమోదానికి పంపించారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత దశల వారీగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏది ఏమైనా వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.