‘బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను వదిలిపెట్టేది లేదు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్రెడ్డి పాత్ర ఉన్నది. పైలట్ రోహిత్రెడ్డి పాత్రపై ఆరా తీయడానికి మా లీగల్ టీం బెంగళూరు వెళ్లింది. ఆ కేసుని ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. డ్రగ్స్ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్రెడ్డికి గతంలోనే నోటీసులు కూడా అందాయి’.
ఈ నెల 14న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామంలో పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలివి. బండి సంజయ్ మాట్లాడిన రెండు రోజులకే రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటీ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. తనకు ఈడీ నోటీసు ఇస్తుందని రెండురోజుల ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఆ సంస్థలు బండి సంజయ్కింద పనిచేస్తున్నాయా? అని నిలదీశారు. పైలట్ రోహిత్రెడ్డికి బెంగళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నదని బండి సంజయ్ బుధవారం ఆరోపించారు. రెండు రోజులు తిరక్కుండానే శుక్రవారం రోహిత్రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న తన వ్యక్తిగత బయోడాటాతోపాటు కుటుంబసభ్యులందరి ఆర్థికలావాదేవీలతో 19న విచారణకు రావాలని రోహిత్రెడ్డిని ఆదేశించింది. అయితే.. ఏ కేసులో విచారణ అన్నది మాత్రం నోటీసులో పేర్కొనకపోవటం గమనార్హం. ఈడీ నోటీసులపై రోహిత్రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్కి జ్యోతిష్యం కూడా తెలుసా? అని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ బండారం బయటపెట్టినందుకు కక్ష సాధించేందుకే ఈడీ నోటీసులు ఇచ్చిందని పైలట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. ‘డ్రగ్స్ కేసులో నాకు ఈడీ నోటీసులు ఇస్తుందని బండి సంజయ్ రెండురోజుల క్రితమే చెప్పారు. ఈడీ నోటీసుల గురించి ఆయనకు ముందే ఎలా తెలుసు? నా బయోడాటా కావాలని ఈడీ నోటీసులు పంపింది. బయోడాటా కోసమైతే ఎన్నికల సంఘానికి నేను సమర్పించిన పత్రాలను చూస్తే సరిపోతుంది. ఈడీ వంటి పెద్ద దర్యాప్తు సంస్థ బయోడాటా అడగడం హాస్యాస్పదంగా ఉన్నది. 14న బండి సంజయ్ చెప్తే.. 16న ఈడీ నోటీసులు ఇచ్చింది. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా? లేకపోతే.. ఆయనకు భవిష్యవాణి, జ్యోతిష్యం ఏమన్నా తెలుసా?’ అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు. ‘కొందరు బ్రోకర్లు స్వామీజీల వేషంలో తెలంగాణకు వచ్చి, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు. ఆ విషయం బయట పెట్టడమే నేను చేసిన తప్పా?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలు సంతోషంగా ఉండటం చూసి బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ను చూసి బీజేపీకి భయం పట్టుకొన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కర్ణాటక పోలీసులు తనకు నోటీసులు ఇచ్చి విచారించారని బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రోహిత్రెడ్డి మండిపడ్డారు. కర్ణాటకకు సంబంధించి డ్రగ్స్ కేసు కానీ, ఇతర కేసులకు సంబంధించి గానీ ఎటువంటి విచారణ జరగలేదని తెలిపారు. ‘డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదని కర్ణాటకలోని గోవిందాపూర్ పోలీస్స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రిపోర్టు ఇచ్చారు. ఆ విషయం అన్ని మీడియా సంస్థల్లోనూ వచ్చింది. నాకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఎప్పుడిచ్చారు? ఎప్పుడు విచారణ చేశారు? డ్రగ్స్ కేసులో తన పేరు ఎక్కడున్నదో బండి సంజయ్ నిరూపించాలి. ఈ విషయంపై యాదాద్రిలో తడి బట్టలతో ప్రమాణానికి నేను సిద్ధం. బండి సంజయ్ కూడా తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. తనకు ఎటువంటి కేసుతో సంబంధం లేకపోయినా ఈడీ నోటీసులు పంపించడం దారుణమని అన్నారు.
ఈడీ నోటీసుల గురించి బండి సంజయ్ ముందే చెప్పటంపై కోర్టుకు వెళ్తానని రోహిత్రెడ్డి తెలిపారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు. ఫాంహౌజ్ ఎపిసోడ్ తర్వాత తనపై బీజేపీ కక్ష కట్టిందని అన్నారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ తప్పు చేయకుంటే సిట్ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘దమ్ముంటే బీఎల్ సంతోష్ సిట్ మందు హాజరు కావాలి. బీఎల్ సంతోష్, తుషార్, స్వామి.. అందరూ నీతిమంతులైతే చట్టపరంగా నిర్దోషులమని నిరూపించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ‘నాకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చిందో అర్థం కావడం లేదు. క్రైమ్ నంబర్ లేదు. ఏం క్రైమో సబ్జెక్టు లేదు. ఎటువంటి ఎలిగేషన్ లేదు. బండి సంజయ్ గుండులాగే.. ఈడీ నోటీసు కూడా చాలా ప్లెయిన్గా ఉన్నది. నోటీసుపై న్యాయ సలహా తీసుకొన్న తర్వాతే విచారణకు హాజరవుతా. నోటీసులకు భయడలేది లేదు. తగ్గేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అని స్పష్టంచేశారు.