హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డొంక కదిలేనా? కొత్త లింకులు బయటపడేనా? అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు హవాలా డబ్బు చేరిందనడానికి ఆధారాలు లభించేనా? వంటి ప్రశ్నలన్నింటికీ మంగళవారం నుంచి సమాధానాలు దొరికే అవకాశాలున్నాయని అంటున్నారు. టాలీవుడ్ డ్రగ్స్కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నవారితోసహా మొత్తం 12మంది టాలీవుడ్ ప్రముఖులకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 50 ప్రకారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా నోటీసులు జారీచేశారు ఈడీ అధికారులు. ఇందులో వరుసక్రమంలో మంగళవారం నాటి విచారణకు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరుకానున్నారు. డ్రగ్స్ కొనుగోళ్లలో మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న ఈడీ అధికారులు ఈ దిశగా సమాచారం సేకరించినట్టు తెలుస్తున్నది. ఈడీ నోటీసులు అందుకున్నవారిలో పూరీ జగన్నాథ్, చా ర్మికౌర్, రకుల్ప్రీత్సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, శ్రీనివాస్, నవదీప్, జనర ల్ మేనేజర్ ఎఫ్-క్లబ్, ముమైత్ఖాన్, తనీశ్, నందు, తరుణ్ ఉన్నారు. 2017 లో ఎక్సైజ్శాఖ నమోదు చేసిన కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, నవదీప్, ము మైత్ఖాన్, తరుణ్, నందుసహా పలువురిని విచారించిన విషయం తెలిసిందే. 12 మందిపై చార్జిషీట్లు దాఖలుచేసింది. ఎక్సైజ్శాఖ డ్రగ్స్ సరఫరా, వినియోగించినవారి వివరాలకే పరిమితమైంది. డ్రగ్స్ అమ్మకంతో వచ్చిన డబ్బును విదేశాలకు పంపినట్టు ఈడీ విచారణలో తేలితే ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.