రూ. 700 కోట్ల విలువైన షేర్లు జప్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇటీవల హైదరాబాద్లోని కార్వీ కార్యాలయం సహా ఆరుచోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు తాజాగా శనివారం కంపెనీ సీఎండీ పార్థసారథితోపాటు ఆయన కుమారుల పేరిట ఉన్న రూ.700 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. మనీలాండరింగ్ చట్టాల కింద దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ఇండస్ఇండ్ బ్యాంకునకు రూ.137 కోట్ల రుణం ఎగవేత, క్లయింట్లకు సంబంధించిన రూ.329 కోట్లను తన అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సోదాల్లో పలు ఆస్తుల పత్రాలు, వ్యక్తిగత డైరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈ-మెయిల్ డంప్లు, ఇతర ముఖ్యమైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.