హైదరాబాద్/నిజామాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ కక్షసాధింపును కొనసాగిస్తున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంటివద్దే విచారించాలని, సమయపాలన పాటించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఈడీ ముందు కవిత ఇప్పటికే మూడుసార్లు హాజరై విచారణ ఎదుర్కొన్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలను చూపలేకపోయినా మరోసారి నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న కేంద్ర మంత్రి అమిత్షా రాష్ర్టానికి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయనకు వేరే ఇతర అంశాలు లేకపోవడంతో ఈడీ ముందు కవిత హాజరును ఒక అస్త్రంగా మార్చుకొనేందుకే ఆమెకు నోటీసులు ఇప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఇవి పొలిటికల్ నోటీసులని, పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేలికగా తీసిపారేశారు.
కేసీఆర్ను చూసి వారికి భయం
మోదీ నోటీసు తనకు అందిందని, రాజకీయ కక్షతో పంపిన ఆ తాఖీదును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత పేర్కొన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ లీగల్ సెల్ విభాగానికి ఇచ్చామని, వారు ఎలా చెప్తే అలా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ నోటీసుపై పెద్దగా ఆలోచించవద్దని, ఏడాది కాలంగా టీవీ సీరియల్లా దీన్ని సాగదీస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నందున కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2జీ కేసు కూడా ఇంతకాలం సాగలేదని అన్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇదే తీరుతో వ్యవహరించటం బీజేపీ విధానమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, తెలంగాణలో మరోసారి కేసీఆరే సీఎం కాబోతున్నారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ చెప్తున్నట్టు తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ప్రజలతోనే తమకు పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలంతా బీజేపీ చేస్తున్నదాన్ని చూస్తున్నారని, వాళ్లే తగిన విధంగా బుద్ధి చెప్తారని వెల్లడించారు.
రాజకీయ కక్ష సాధింపు
బీఆర్ఎస్పై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కవితకు మళ్లీ నోటీసులు పంపిందని రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. అకస్మాత్తుగా మళ్లీ నోటీసులు జారీచేసి, ఉన్న పలాన రావాలని ఆదేశించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉన్నదని అనుమానిస్తున్నారు. కచ్చితంగా దీనివెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఈ స్కామ్తో తనకు సంబంధం లేదని కవిత అనేకసార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే మూడుసార్లు ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనూ అధికారుల ముందు ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు. అయినా ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇవ్వడం అంటే.. కచ్చితంగా బీజేపీ కక్షసాధింపు చర్యేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొలేక, మానసికంగా క్షోభ పెట్టేందుకే ఇలా ఎమ్మెల్సీ కవితను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ఇవి ఈడీ నోటీసులు కాదని, కచ్చితంగా పొలిటికల్ నోటీసులని మండిపడుతున్నారు.