హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఐఎస్ సదన్లోని చికోటి ప్రవీణ్ ఇంట్లో అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
నేపాల్ క్యాసినోకు టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన 10 మంది సినీ తారలు పాల్గొన్నట్లు ఈడీ గుర్తించింది. అంతకుముందు వారితో ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సినీ తారలతో ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఐఎస్ సదన్లోని ప్రవీణ్ ఇల్లు, కడ్తాల్లోని ఫాంహౌస్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.