హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గొర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే విపక్షాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. ఇలా చేయాలని ఆర్ఎస్ఎస్ చెప్పిందా? అంటూ ప్రశ్నించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్సిన్హాకు టీఆర్ఎస్ మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలో ప్రభుత్వాలను కుట్రలతో కూల్చి బీజేపీ అధికారం చేపట్టిన విషయాలను గుర్తు చేశారు. శివసేనలో తలెత్తిన సమస్యను ఆ పార్టీ పరిషరించుకుంటుందని, ఆ వ్యవహారంతో బీజేపీకి ఏం పని? అని నిలదీశారు.