హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను సోమవారం జప్తు చేసింది. వీటిలో తమిళనాడు దిండిగల్ జిల్లాలోని రూ.411.83 కోట్ల విలువైన ఆమ్వే ఫ్యాక్టరీ బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ తదితర స్థిరాస్తులతోపాటు 36 బ్యాంకు ఖాతాల్లోని రూ.345.94 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా పిరమిడ్ విధానంలో మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్న ఆమ్వే సంస్థ ప్రజలకు పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకొన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. గొలుసుకట్టు మార్కెట్లో చేరితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని, స్వల్ప కాలంలోనే ఆస్తిపరులు అవుతారని ఆశ చూపి ఎంతో మంది ప్రజలను ఈ రొంపిలోకి దింపినట్టు తెలిపారు. ఇలా 2002 నుంచి ఇప్పటి వరకు జనం నుంచి రూ.27,562 కోట్లు వసూలు చేసిందని, ఇందులో తమ కంపెనీలో చేరిన సభ్యులకు కమీషన్ల రూపంలో రూ.7,588 కోట్లు మాత్రమే చెల్లించిందని వివరించారు.
1996-97 మధ్య భారత్లోకి ప్రవేశించిన ఈ కంపెనీ.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అమెరికాలోని తన మాతృ సంస్థలకు డివిడెండ్, రాయల్టీ రూపంలోనే రూ.2859.10 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఆమ్వే మల్టీలెవల్ మార్కెటింగ్లో ప్రజలను చేర్చడంలో బ్రిట్ వరల్డ్వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్వర్క్ ట్వంటీ వన్ ప్రైవేట్ లిమిటెడ్ చురుగ్గా వ్యవహరించినట్టు వెల్లడించారు. ఈ రెండు సంస్థలు పెద్దపెద్ద సమావేశాలు నిర్వహించి.. ఏజెంట్లుగా చేరేవారికి అత్యంత విలాసవంతమైన హోటళ్లలో విందులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.