హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలు ప్రధాని మోదీ చేతిలో ఆయుధాలుగా మారడం ఆందోళనకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో బుధవారం జరిగిన సీపీఐ మేడ్చల్ – మలాజిగిరి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను అంతం చేసేందుకు కుట్రపూరిత ఆలోచనల్లో ప్రధాని మోదీ నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి తొత్తులుగా మారడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్రావును హతమార్చడాన్ని కూనంనేని తీవ్రంగా ఖండించారు.