న్యూఢిల్లీ, మార్చి 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అడ్వైజరీ జారీచేయనున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస చర్యలను ఎత్తిచూపుతూ ఇలాంటి అరెస్టులు, దాడులను ముందస్తుగా పరిశీలించేందుకు ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి సూచించాయి. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్, ఇటీవల కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్పై ఈసీకి విడిగా లేఖ రాసింది. ఎన్నికల సంఘం వీటన్నింటినీ పరిశీలనకు తీసుకున్నది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో దర్యాప్తు సంస్థలకు ఈసీ జారీ చేసిన సలహాను ప్రతిపక్షాలు మరోసారి గుర్తు చేశాయి. ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తటస్థంగా ఉండాలని అప్పట్లో ఈసీ తెలియచేసింది.