చెన్నూర్/మందమర్రి, జనవరి 11 : ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలుశాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులుతో సెర్ప్, మెప్మా కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో చెన్నూర్ నియోజకవర్గంలో 102 గ్రామాల్లో 102 సమ్మక్క – సారలమ్మ మహిళ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి భవన నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.
అనంతరం సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కోమటి చెరువుపై నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి, రాక్ గార్డెన్, గ్లో గార్డెన్, నెక్లెస్ రోడ్తో పాటు ట్యాంక్బండ్ సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు.
సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెన్నూర్, మందమర్రి మున్సిపాలిటీ కేంద్రాలలో గల చెరువుల పై చేపట్టిన ట్యాంక్బండ్ నిర్మాణాలను సిద్దిపేట తరహాలో నిర్మించాలనే ఉద్దేశంతో కోమటి చెరువును సందర్శించినట్లు తెలిపారు.