TSRTC | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. వీటిలో 10 బస్సులను మంగళవారం మియాపూర్ లో ప్రారంభించనున్నది. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతలవారీగా అందుబాటులోకి రానున్నాయి. హైటెక్ హంగులతో హైదరాబాద్- విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఈ- గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రెండేండ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. హైదరాబాద్లో 10 డబుల్ డెకర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొననున్నారు.