హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్లించే లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమే ఎక్మో అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి చెప్పారు. ఒక వ్యక్తి గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో ఎక్మో పరికరాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి శ్వాసకోశాలు, గుండె చేసే పనులను శరీరం బయట చేస్తారని తెలిపారు. భారతదేశంలో కొవిడ్ తర్వాత ఎక్మో అవసరం ఎక్కువగా పెరిగిపోయిందని వెల్లడించారు. ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఎక్మోపై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్షాప్ శనివారం నిర్వహించింది.
ఈ వర్క్షాప్లో డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంవో-ఎక్మో) అనేది తీవ్రంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, గుండెకు అత్యంత అధునాతనమైన లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్లలో ఒకటని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా ఎక్కువ మంది పేషెంట్లను ‘ఎక్మో’ సహాయంతో కాపాడిన దవాఖానల్లో యశోద హాస్పిటల్స్ ఒకటిని గుర్తుచేశారు. మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్షాప్ వైద్యులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం, రోగుల సంరక్షణలో ఆవిష్కరణ, సహకారం, శ్రేష్ఠతను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వర్క్షాప్లో 20 మందికిపైగా ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ అధ్యాపకులు, 100 మందికిపైగా ప్రసిద్ధ జాతీయ అధ్యాపకులు, దేశవ్యాప్తంగా 1,000 మందికిపైగా ఎక్మో వైద్యులు, అడల్ట్, పీడియాట్రిక్ వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ పెర్ఫ్యూనిస్ట్ నర్సింగ్, రెస్పిరేటరీ థెరపిస్ట్లు పాల్గొన్నారు.