హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘ఓటు వజ్రాయుధం.. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. ఓటు విలువ తెలుసుకో.. మంచి కోసం వాడుకో’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల కమిషన్ ఇలాంటి నినాదాలతో ప్రజలను చైతన్యం చేసేది. ఎన్నికల్లో ఎవరూ ప్రలోభాలకు గురికావద్దని నర్మగర్భంగా చెప్పేది. కానీ, గతానికి అతీతంగా మునుగోడులో ఈసీ ప్రచారం చేపట్టింది. ‘ఓటు మీ హక్కు.. దాన్ని అమ్ముకోకు’ అని నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ పేరుమీద పోస్టర్లు వెలిశాయి.
ఇదే కారణమా?
రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే మునుగోడు ప్రజల నమ్మకాన్ని బీజేపీకి అమ్ముకొని రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను మూడేండ్లుగా బీజేపీతో టచ్లో ఉన్నానని, ఆరు నెలల క్రితమే కాంట్రాక్ట్ వచ్చింది’ అని రాజగోపాల్రెడ్డి పేర్కొన్న ఉదంతాన్ని టీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఆ డబ్బుతోనే నియోజకర్గంలో ప్రలోభాలకు తెరలేపారని ప్రచారం జరుగుతున్నది. ఈ కారణంగానే మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘమే రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.